భారత భూభాగాలతో ఉన్న కొత్త మ్యాప్ ను యూఎన్ కు పంపించిన నేపాల్ ..
By: Sankar Sun, 02 Aug 2020 08:01 AM
గత కొంతకాలంగా మిత్ర దేశం అయినా భారత్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్న నేపాల్ ..తాజాగా మరొక అడుగు ముందుకు వేసింది.. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ రూపొందించిన నూతన మ్యాప్ను.. ఐక్యరాజ్యసమితి, గూగుల్కు పంపించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ దేశ మీడియా శనివారం తెలిపింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం మ్యాప్ను ఆంగ్లంలో ప్రచురించడంతో పాటు.. ఐక్యరాజ్యసమితి, గూగుల్తో సహా అంతర్జాతీయ సమాజానికి పంపడానికి అవసరమైన సన్నాహాలు చేస్తోందని సమాచారం.
ఈ సందర్భంగా ‘మేము త్వరలో లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలతో ఉన్న మ్యాప్ను అంతర్జాతీయ సమాజానికి పంపిస్తాము’ అని నేపాల్ మంత్రి పద్మ ఆర్యాల్ తెలిపారు. అంతేకాక ‘ఆక్రమిత భూభాగాలతో’ అనే పేరుతో ఈ మూడు భూభాగాలకు సంబంధించి ఒక పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా నేపాల్ ప్రభుత్వం సన్నద్ధమవుతోందని పద్మ ఆర్యాల్ తెలిపారు.
అయితే, ఈ నూతన మ్యాప్ను అంతర్జాతీయ సమాజానికి పంపడమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను తమ దేశ అంతర్భాగంలో చేర్చిన మ్యాప్ను జూన్ 13న నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మూడు ప్రాంతాలు తమకు చెందినవేనని భారత్ స్పష్టం చేసింది.