భారత ప్రధాని మోడీకి ఫోన్ చేసి విషెస్ చెప్పిన నేపాల్ ప్రధాని
By: Sankar Sun, 16 Aug 2020 5:31 PM
గత కొద్దీ కాలంగా భారత్ మీద ఎదో ఒక విధంగా విమర్శలు చేస్తూ భారత్ లోనే గాక సొంత దేశంలో కూడా అపఖ్యాతి మూటకట్టుకున నేపాల్ ప్రధాని కెపి ఓలి శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.
అదే విధంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాడాల్సిన తీరుపై ఇరు దేశాధినేతలు చర్చించారు. నేపాల్కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్నేహ హస్తం అందించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాల గురించి మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అయితే గత కొన్ని రోజులుగా సరిహద్దుల విషయంలో నెలకొన్న వివాదం గురించి మాత్రం ఏవిధమైన చర్చ జరగలేదు. ఈ మేరకు విదేశాంగ శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా సుదీర్ఘ కాలంగా మిత్ర దేశంగా కొనసాగుతున్న భారత్ పట్ల నేపాల్ అనుచిత వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. భారత భూభాగంలోని లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను నేపాల్లో కలుపుతూ కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కొత్త మ్యాపులు విడుదల చేసింది. అంతేగాక దీనిని ఐరాసకు పంపించేందుకు సిద్ధమైంది..