మరోసారి ఇండియా మీద విమర్శలు చేసిన నేపాల్ ప్రధాని
By: Sankar Tue, 26 May 2020 4:36 PM
ఇండియా మీద పొరుగు దేశం అయిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి భారత్పై విరుచుకుపడ్డారు..భారత సరిహద్దుల వద్ద నిబంధనలు ఉల్లంఘించి పౌరులు తమ దేశంలో ప్రవేశించి ప్రాణాంతక కరోనా వైరస్ను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను తుంగలో తొక్కి అంటువ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నారంటూ మండిపడ్డారు. ఇతర దేశాల వల్లే నేపాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ పరోక్షంగా భారత్పై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఓలి... దక్షిణాసియాలో అన్ని దేశాల కంటే నేపాల్లోనే కరోనా మరణాల సంఖ్య అతి తక్కువగా ఉందన్నారు. ఈ క్రమంలో నేపాలీ వైద్య నిపుణుల సూచనల ప్రకారం దేశ జనాభాలోని రెండు శాతం ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా లక్షణాలతో బాధ పడుతున్న వారికి క్వారంటైన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు.