కాలాపాని, లిపులేఖ్, లింపియాధూరాలలో జనభా లెక్కలు కోసం యోచిస్తున్న నేపాల్...
By: chandrasekar Fri, 25 Sept 2020 3:12 PM
నేపాల్ ప్రభుత్వం భారతదేశానికి చెందిన ప్రాంతాలైన కాలాపాని, లిపులేఖ్, లింపియాధూరాలలో
జనభా లెక్కలు చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కొత్తగా తయారుచేసిన దేశ
పటాన్ని ఆమోదించడానికి రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించిన తరువాత నేపాల్ ఈ
ప్రాంతాల్లో తమ అధికారిక కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నది. తమ దేశానికి చెందిన
ప్రాంతాల్లో పరాయి దేశాన్ని అనుమతించేది లేదని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ప్రతి 10
సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనాభా లెక్కలు ఈ సారి 2021 మే
నెలలో జరుగాల్సి ఉన్నది. నేషనల్ ప్లానింగ్ కమిషన్, దాని సెంట్రల్ బ్యూరో ఆఫ్
స్టాటిస్టిక్స్ నిర్వహించిన ఎక్సర్సైజ్లో దేశవ్యాప్తంగా ఇంటింటికీ సర్వే
ఉంటుంది.
కొత్తగా నేపాల్ మ్యాప్లో
చేర్చిన భారత దేశానికి చెందిన కాలాపాని, లిపులేఖ్, లింపియాధూరాలలో కూడా జనాభా గణన చేపట్టాలని
నిర్ణయించడమే ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఘర్షణకు కారణమవుతున్నది. నేపాల్
ప్రభుత్వం చర్యల గురించి తమకు తెలియదని పిథోరాగఢ్ జిల్లా పరిపాలన అధికారులు
చెప్తున్నారు. అయితే జనాభా గణన నిర్వహించడానికి నేపాల్ బృందాన్ని ఈ ప్రాంతంలోకి
అనుమతించకపోవడంతో అలాంటి ప్రణాళిక ఉన్నప్పటికీ అది విఫలమవుతుందని వారు అంటున్నారు.
తాము భారతీయులైనందున ఎట్టిపరిస్థితుల్లో నేపాల్ జరిపే జనాభా లెక్కల ఎక్సర్సైజ్లో
పాల్గొనమని కాలాపాని స్థానికులు చెప్తున్నారు. నేపాల్ ఇందు కోసం ఒక
ప్రశ్నాపత్రాన్ని కూడా రూపొందించినట్లు సమాచారం.
భారత్కు చెందిన
ప్రాంతాల్లో నేపాల్ జనాభా లెక్కలు జరిపితే అది మరో ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసే
ప్రమాదముంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్కు చెందిన భూభాగాలను తమ
మ్యాప్లో చూపిన నేపాల్. సరిహద్దుల్లో చైనా చేస్తున్న దురాక్రమణలపై ఒక్కమాట కూడా
మాట్లాడటం లేదని వారు గుర్తుచేస్తున్నారు. ఇలాఉండగా, తమ దేశానికి చెందిన
ప్రాంతాల్లో పరాయి దేశం అధికారులను అనుమతించేది ఉండదని భారత ప్రభుత్వం
స్పష్టంచేసింది. నేపాల్లోని హుమ్లా జిల్లాలో చైనా ఆక్రమణకు సంబంధించిన వార్తలు
స్థానిక మీడియాలో కనిపించిన తరువాత, నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వీటిని ఖండించింది.