ప్రశాంత వాతావరణంలో నీట్ నిర్వహణ, మార్గదర్శకాలివే
By: Dimple Thu, 27 Aug 2020 01:41 AM
ఇంటర్మీడియట్ విద్యార్హతతో వైద్యవిద్య, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి జాతీయస్థాయిలో నిర్వహింప తలపెట్టిన నీట్, జెఈఈ పరీక్షలు సెప్టెంబరు ఒకటో తేదీనుండి ఆరంభం కాబోతున్నాయి. జులైలో జరగాల్సిన జాతీయ స్థాయి వైద్య విద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నీట్, జేఈఈ.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. కాగా, ఈ పరీక్షల నిర్వహణ తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీఏ) ఇటీవల ప్రకటించింది. జేఈఈ ప్రాథమిక పరీక్ష (మెయిన్) సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు.. నీట్ (యూజీ) పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించనుంది. ఈ క్రమంలో జేఈఈ హాల్టికెట్లు ఇప్పటికే విడుదల కాగా, నీట్ అడ్మిట్కార్డులు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. అంతేకాకుండా ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు మార్గదర్శకాలను కూడా సంస్థ నిర్దేశించింది.
*విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటించాలి.
*పరీక్షల విధుల్లో ఉన్న సిబ్బందికి గ్లౌజులు, మాస్కులు ధరించేందుకు అనుమతి ఉంది. వాటిని తెచ్చుకోని విద్యార్థులకు నిర్వాహకులే అందజేస్తారు.
*ప్రతి కేంద్రం వద్ద శానిటైజర్ ఏర్పాటు ఉంటుంది.
*డెస్కులు, టేబుళ్లు, డోర్ హ్యాండిల్ వంటివి క్రిమిరహితం చేసేందుకు స్ప్రే బాటిళ్లు, స్పాంజ్ లేదా వస్త్రాన్ని అందుబాటులో ఉంచుతారు.
*పరీక్షా కేంద్రం ప్రవేశ ద్వారాల వద్ద శరీర ఉష్ణోగ్రతను పరిశీలించే థెర్మోగన్లను ఏర్పాటు చేస్తున్నారు.
అంతేకాకుండా దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షా కేంద్రాల సంఖ్యను 570 నుంచి 660కి.. నీట్ పరీక్షా కేంద్రాల సంఖ్య 2546 నుంచి 3843కు పెంచినట్టు ఎన్టీఏ ప్రకటించింది. భౌతిక దూరం నిబంధనకు అనుగుణంగా.. జేఈఈలో విద్యార్థులకు వరుస విడిచి వరుసలో సీట్లు కేటాయించగా, నీట్ విద్యార్థులు గదికి కేవలం 12 మందే ఉంటారని తెలిపింది.