నంద్యాల సామూహిక ఆత్మహత్య కేసు ....సీఐ, హెడ్ కానిస్టేబుల్ల బెయిల్ రద్దు
By: Sankar Mon, 30 Nov 2020 6:53 PM
అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్ల బెయిల్ను నంద్యాల కోర్టు రద్దు చేసింది. అబ్దుల్ సలాం కేసులో ప్రభుత్వం తరపున ఏపీ హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విన్న నంద్యాల కోర్టు.. ఆయన మాటలకు ఏకీభవించింది.
దాని ప్రకారం సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ల బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీసీ సెక్షన్ 306ను అమలు పరుస్తూ బెయిల్ రద్దు చేసినట్లు కోర్టు వెల్లడించింది. డిసెంబర్ 2 వ తేదీ లోగా నంద్యాల జిల్లా కోర్టులో హాజరు కావాలని సీఐ సోమశేఖర్ రెడ్డిని, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లని నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి మొక సువర్ణ రాజు ఆదేశించారు...
కాగా అబ్దుల్ సలాం , అతని భార్య నూర్జహాన్ , కుమారుడు దాదా ఖలందర్ , కూతురు సల్మా ఈ నెల 3వ తేదీన గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.పోలీసుల వేధింపుల వలెనే తాము ఆత్మహత్యకు పాల్పడినట్లు చనిపోయేముందు ఒక సెల్ఫీ వీడియోలో వారు వెల్లడించిన విషయం తెలిసిందే...