ఎమ్మెల్యే రోజా ఫైర్... చంద్రబాబు జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలే...!
By: Anji Fri, 20 Nov 2020 1:53 PM
చంద్రబాబు నాయుడి జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలకే సరిపోయిందని నగిరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. తిరుపతి ఎంపీ కరోనాతో చనిపోతే, హడావిడిగా అభ్యర్థిని ప్రకటించి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా..? అని ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు.
శుక్రవారం రోజా తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… ‘కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
వెయ్యికాళ్ల మండపం త్వరలో ప్రారంభించేందుకు టీటీడీ చైర్మన్ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ పారదర్శకంగా రాజకీయాలు చేస్తున్నారని కొనియాడారు.
ఇక కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సమయంలోనూ.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ప్రజలకు కనీసం భరోసా కూడా కల్పించలేదని రోజా అన్నారు. కరోనా సమయంలో ప్రజల గురించి ఆలోచించకుండా బాబు హైదరాబాద్లో దాక్కున్నాడని మండిపడ్డారు.
జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి మరణం సంభవించిన కుటుంబంలో పోటీ పెట్టకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారని, కానీ చంద్రబాబు తన సామాజిక వర్గం వారిని నిలబెట్టేందుకు స్థానిక ఎన్నికల కోసం హడావిడి చేస్తున్నారని అన్నారు.
అప్పుడు కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా పడేలా చేశారని.. ఇప్పుడేమో రాష్ట్రంలో కరోనా లేదని ఎన్నికలు పెట్టాలని స్టేట్మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు. మార్చి లోపల ఎన్నికలు పెడితే అన్ని స్థానాలను గెలుచుకుంటామన్న భ్రమలో టీడీపీ ఉందని రోజా తూర్పారబట్టారు.