వీడిన క్రికెటర్ సురేష్ రైనా కుటుంబీకుల హత్య కేసు
By: Anji Thu, 17 Sept 2020 11:53 AM
మిస్టరీగా మారిన క్రికెటర్ సురేష్ రైనా బంధువుల్లోని ఇద్దరి హత్య కేసు చిక్కుముడి వీడింది. హత్యకు పాల్పడిన వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం వెల్లడించారు.
గతనెల 19న అర్ధరాత్రి పఠాన్కోట్లోని రైనా బంధువు అశోక్ కుమార్ ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వారి దాడిలో అశోక్ అక్కడిక్కడే మరణించగా ఆయన కుమారుడు కౌశల్ గాయాలతో ఆగస్టు 31న మృతి చెందాడు. రైనా మేనత్త ఆశారాణి ఆసుపత్రిలో ఇంకా మృత్యువుతో పోరాడుతోంది.
పంజాబ్ డీజీపీ దిన్కర్ గుప్తా మాట్లాడుతూ.. 11 మంది సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా పంజాబ్, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్లో ఇలాంటి పలు ఘటనలకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. పంజాబ్లోని పఠాన్కోట్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో సంచరిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి కొంత బంగారం, హత్యలకు వాడిన కర్రలు, రూ.1530 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.