ఏలూరులో పెరుగుతున్న వింతవ్యాధి బాధితుల సంఖ్య
By: Sankar Tue, 08 Dec 2020 10:33 AM
ఏలూరులో వింతవ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అస్వస్థతకు గురైనవారు 3 నుంచి 5 నిమిషాలపాటు మూర్ఛ పోతున్నారని గుర్తించారు.
కొందరు మతిమరుపుతో పాటు తలనొప్పి, వెన్నునొప్పి, నీరసంగా ఉంటోందని చెబుతున్నారు. ఇప్పటివరకూ ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదని అధికారులు చెబుతున్నారు. చాలామందికి సీటీ స్కాన్ చేసినా.. ఎలాంటి సమస్యలు బయటపడలేదు. నీటి పరీక్షలు,రక్త నమూనాలను పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయి. దీంతో వ్యాధి కారణాలు తెలియక ప్రజలు, అధికార యంత్రాంగం మాత్రం ఆందోళనలో ఉంది.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న డబ్ల్యుహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ భవాని... వింత వ్యాధి వ్యాప్తిపై మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. కేసుల వివరాలు, పేషేంట్స్ లక్షణాలు, రిపోర్ట్స్ ఫలితాలపై సమీక్షలో చర్చించారు. పాలు, నీళ్ల పరీక్షల్లో సాధారణ ఫలితాలు రావడంతో కూరగాయలపై దృష్టిపెట్టాలని... వాటిని పురుగుమందు పరీక్షలకు పంపాలని ఆదేశించారు..