Advertisement

  • ఆధిపత్య పోరులో పరస్పరం హత్యలు చేసుకున్నారు: చంద్రబాబునాయుడు

ఆధిపత్య పోరులో పరస్పరం హత్యలు చేసుకున్నారు: చంద్రబాబునాయుడు

By: chandrasekar Mon, 06 July 2020 6:01 PM

ఆధిపత్య పోరులో పరస్పరం హత్యలు చేసుకున్నారు: చంద్రబాబునాయుడు


రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్‌రావు దారుణ హత్యపై తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధిపత్య పోరులో పరస్పరం హత్యలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు.

ఈ మేరకు పార్టీ నాయకులతో ఆదివారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన కారణంగానే మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించారని ఆరోపించారు.

చీమకు కూడా అపకారం చేయని మనిషి కొల్లు రవీంద్ర అని చంద్రబాబు చెప్పారు. కొల్లు రవీంద్రను ఇరికించేందుకే కాల్స్‌ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఆధిపత్య పోరులో భాగంగా పరస్పరం హత్యలు చేసుకున్నారని, ఆ రెండు కుటుంబాల మధ్య కక్షలను రెచ్చగొట్టింది వైసీపీనేనని వ్యాఖ్యానించారు.

అసలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 13 నెలలైనా ఇంతవరకు ఎందుకు హంతకులను పట్టుకోలేకపోయారని చంద్రబాబు ప్రశ్నించారు.

టీడీపీ నిర్మించిన ఇళ్లను ఇంతవరకు పేదలకు అందించలేదని విమర్శించారు. టీడీపీపై కక్షతోనే లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. హౌసింగ్‌ పెండింగ్‌ బిల్లులు, ఇళ్ల స్వాధీనంపై టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఇళ్ల నిర్మాణంలో వైసీపీ వేధింపులపై సోమవారం నిరసనలు తెలపాలని పార్టీ నేతలకు సూచించారు. ఇళ్ల స్థలాల్లో వైసీపీ అవినీతి, కుంభకోణాలపై ఈ నెల 7న నిరసనలు తెలియజేయాలని కోరారు.

Tags :
|

Advertisement