మురళీధరన్ విన్నపం.. బయోపిక్ ‘800’ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి...
By: chandrasekar Tue, 20 Oct 2020 12:44 PM
శ్రీలంక మాజీ క్రికెటర్, దిగ్గజ
స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’
నుంచి తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి
తప్పుకున్నారు. మురళీధరన్ విజ్ఞప్తి మేరకు విజయ్ సేతుపతి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు మురళీధరన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ సినిమా చేయడం వల్ల విజయ్ సేతుపతి
కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని, అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోవాలని
మురళీధరన్ కోరారు. అయితే, విజయ్ సేతుపతి స్థానంలో మరో నటుడిని నిర్మాతలు ఎంపిక
చేస్తారని తన బయోపిక్ త్వరలోనే అభిమానులు, ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుందని మురళీధరన్
ఆశాభావం వ్యక్తం చేశారు.
మురళీధరన్ స్టేట్మెంట్ను
సోమవారం ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన విజయ్ సేతుపతి.. ‘‘ధన్యవాదాలు.. ఇక సెలవు’’
అని తమిళంలో పేర్కొన్నారు. ముత్తయ్య మురళీధరన్ స్టేట్మెంట్లో ఇలా పేర్కొన్నారు..
‘‘నా బయోపిక్ 800ను చుట్టుముట్టిన వివాదం నేపథ్యంలో ఈ ప్రకటనను విడుదల
చేస్తున్నాను. లేనిపోని అపోహలతో 800 సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవాలని కొంత మంది
ఒత్తిడి తీసుకొస్తున్నారు. తమిళనాడులోని మంచి నటుల్లో ఒకరైన విజయ్ నా వల్ల ఇబ్బంది
పడటం నాకు ఇష్టం లేదు. అందుకే, ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన్ని తప్పుకోవాలని రిక్వెస్ట్
చేస్తున్నాను. ఈ సినిమా వల్ల భవిష్యత్తులో విజయ్ సేతుపతికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు
కాకూడదు.
ఆటంకాలతో నేను ఎప్పుడూ
అలసిపోను. ఎన్నో అవరోధాలను ఎదుర్కొని, అధిగమించి నేను ఈ స్థాయికి చేరుకున్నాను. ఔత్సాహిక
యువ క్రికెటర్లలో స్ఫూర్తిని, విశ్వాసాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈ బయోపిక్ను నేను
అంగీకరించాను. ఈ అడ్డంకులన్నింటినీ నిర్మాతలు అధిగమిస్తారని నేను నమ్ముతున్నాను.
దీనిపై త్వరలోనే ఒక ప్రకటన చేస్తామని వారు నాకు ప్రామిస్ చేశారు. వాళ్ల
నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ప్రెస్కి, రాజకీయ నాయకులకు, విజయ్ సేతుపతి అభిమానులకు, మరీ
ముఖ్యంగా ఈ కష్టకాలంలో నాకు అండగా నిలిచిన తమిళనాడు ప్రజలకు మనస్ఫూర్తిగా
ధన్యవాదాలు తెలుపుతున్నాను.’’ఇదిలా ఉంటే, శ్రీలంక తమిళియన్ అయిన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’లో
విజయ్ సేతుపతి టైటిల్ రోల్ పోషిస్తున్నట్టు ప్రకటించిన కొద్ది సేపటికే తమిళనాడులో
వివాదం మొదలైపోయింది. దీనికి కారణం శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత
ప్రధాన మంత్రి మహింద రాజపక్సను మురళీధరన్ గతంలో సపోర్ట్ చేయడమే. సుమారు 30 ఏళ్ల
పాటు శ్రీలంకలో జరిగిన తమిళ పులుల అంతర్యుద్ధాన్ని అంతమొందించడమే కాకుండా కొన్ని
లక్షల మంది తమిళలను ఊచకోత కోసిన మహింద రాజపక్సపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత ఉంది.