గ్యాస్ లీక్గా భావించి ముంబై వాసులు తీవ్ర ఆందోళన
By: chandrasekar Mon, 08 June 2020 3:50 PM
కరోనాతో వణికిపోతున్న ముంబై నగరాన్ని ఘాటు వాసన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శనివారం రాత్రి నుంచి వ్యాపిస్తున్న అంతుచిక్కని వాసనతో నగర వాసులు ఆందోళనకు గురవుతున్నారు. చెడు వాసన వస్తోందంటూ ముంబైలోని పలు ప్రాంతాలకు చెందిన వారు శనివారం సాయంత్రం నుంచి నగరపాలక సంస్థకు ఫిర్యాదు చేశారు.
బృహన్ ముంబై నగరపాలక సంస్థ విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక దళాలను రంగంలోకి దింపింది. ఈ బృందాలు గత రాత్రి నుంచి ప్రయత్నిస్తున్నా చెడు వాసనలకు కారణం ఏంటో ఇప్పటివరకు కనిపెట్టలేకపోయాయి. దీంతో ఆందోళన కొనసాగుతోంది. గ్యాస్ లీక్ అనుకుని ముంబై వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముంబైలోని చెంబూర్, మన్ఖుర్డ్, ఘాట్కోపర్, పొవాయ్, అంధేరీ, కంజూర్మార్గ్, విఖ్రోలీ తదితర ప్రాంతాల్లో ఈ ఘాటు వాసన వస్తోందంటూ ప్రజలు ఫిర్యాదులు చేశారు. మొత్తం 15 ప్రాంతాల నుంచి 37 ఫిర్యాదులు అందాయి. దీంతో ముంబై నగర పాలక సంస్థ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ఫైర్ సిబ్బందిని రంగంలోకి దించింది.
అమెరికాకు చెందిన ఓ విటమిన్ కంపెనీ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు తొలుత అనుమానించారు. కానీ, అక్కడ ఎలాంటి లీకేజీ లేదని తేలింది. అసలు ఆ గ్యాస్ ఎక్కడ నుంచి లీకవుతుందో గుర్తించడానికి అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.
పదిహేడు ఫైర్ ఇంజిన్లను
రంగంలోకి దించారు. చెడు వాసనకు మూలాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటితో
పాటు హజ్మత్ వాహనాలను కూడా సిద్ధంగా ఉంచారు. ఇది ప్రమాదకర రసాయనాలను పసిగట్టి
నియంత్రిస్తుంది. ప్రభావిత ప్రాంతాల్లో అన్ని పెట్రోలియం కార్పొరేషన్లను, గ్యాస్
కంపెనీలను అధికారులు అప్రమత్తం చేశారు. అయినప్పటికీ ఎక్కడా ఆ వాసనకు సంబంధించిన
ఆనవాళ్లు కనిపెట్టలేకపోయారు. చెడు వాసనకు మూలాలు కనిపెట్టలేకపోయిన బృహన్ ముంబై
మున్సిపల్ కార్పొరేషన్ అది గ్యాస్ లీక్ కాదని మాత్రం స్పష్టం చేసింది. దీనికి
గల కారణాలపై శోధిస్తునట్లు తెలిపింది. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని మంత్రి
ఆధిత్య ఠాక్రే ప్రజలకు సూచించారు.
ఆ చెడు వాసనలు డ్రైనేజీలో
ఉత్పత్తి అయిన మీథేన్ తాలూకు వాసన అయుండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. పరిశోధన
కొనసాగుతోందని తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్లోనూ ఇదే తరహా వాసనతో ముంబైలోని పలు
ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.