ముంబై లో వెలుగు చూసిన ఫేక్ టిఆర్పి రేటింగ్ స్కాం
By: Sankar Fri, 09 Oct 2020 07:18 AM
ముంబైలో ఒక టెలివిజన్ రేటింగ్స్ పాయింట్స్(టీఆర్పీ) స్కామ్ వెలుగు చూసింది. టీవీ కార్యక్రమాల ప్రజాదరణను గణాంకాలతో వివరించే టీఆర్పీ ఆధారంగా ఆయా కార్యక్రమాలకు ప్రకటనలు వస్తాయి. ముంబైలో కొన్ని టీవీ చానళ్లు అక్రమ మార్గాల ద్వారా టీఆర్పీలను పెంచుకుంటున్న విషయాన్ని పోలీసులు గురువారం బట్టబయలు చేశారు. ఇందుకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు..
రిపబ్లిక్ టీవీకి కూడా ఈ కుంభకోణంలో భాగం ఉందని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్ వెల్లడించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసులో మహరాష్ట్ర ప్రభుత్వంపై, ముంబై పోలీసులపై ఆ న్యూస్ చానల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆ వార్తాచానల్ పాత్రకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామని పరమ్వీర్ సింగ్ తెలిపారు. సుశాంత్ మృతి కేసులో ప్రశ్నించినందువల్ల ముంబై పోలీస్ కమిషనర్ తమపై తప్పుడు అభియోగాలు మోపారని ఆ చానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఆరోపించారు.
రెండు మరాఠీ చానళ్లు అయిన ఫాస్ట్ మరాఠీ, బాక్స్ సినిమాల యజమానులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చానళ్లకు చెందిన బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామన్నారు. ‘టీఆర్పీల ఆధారంగా∙చానళ్లకు ప్రకటనలు వస్తాయి. తద్వారా ఆదాయం వస్తుంది. ఇదంతా వేల కోట్ల వ్యవహారం. తప్పుడు విధానాలతో టీఆర్పీలను పెంచుకుని చూపించి ఆయా చానళ్లు ఆదాయం పెంచుకున్నాయి’ అని వివరించారు