ముంబై అలెర్ట్ ..రాబోయే నాలుగు గంటల్లో భారీ వర్షాలు
By: Sankar Thu, 06 Aug 2020 10:48 AM
మహారాష్ర్ట రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండుమూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబై నగరం అతలాకుతలమవుతోంది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. రాబోయే 3-4 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముంబై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మెరిసే అవకాశం ఉందని తెలిపింది.
నిన్న కురిసిన కుండపోత వర్షానికి ముంబైలోని నాయర్ ఆస్పత్రి జలమయం అయింది. ఆస్పత్రికిలోకి వరద నీరు రావడంతో రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్ఎస్ పాట్కర్ మార్గ్ లోని గోడ కూలిపోయింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ను పోలీసులు మళ్లీస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో కొలబాలో 331.8 మిల్లిమీటర్ల వర్షపాతం, శాంతక్రూజ్ ఏరియాలో 162.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. ముంబైలో 5, కోల్హాపూర్లో 4, సంగ్లీలో 2, సతారా, థానే, పాల్ఘర్, నాగ్పూర్, రాయ్గఢ్లో ఒక్కొక్క దళం అందుబాటులో ఉన్నాయి.