ధోనీ రికార్డుల్ని ఎవ్వరూ అధిగమించలేరు - గౌతం గంబీర్
By: Dimple Tue, 18 Aug 2020 00:24 AM
ప్రపంచకప్ పోటీల్లో సెంచరీ చేయడానికి అవకాశం కల్పించలేదని మహేంద్రసింగ్ ధోనీపై నిప్పులు చెరిగిన గౌతంగంభీర్... ఇపుడు ధోనీని పొగడ్తలతో ముంచెత్తాడు. ధోనీ సాధించిన రికార్డుల్ని ఎవ్వరూ అధిగమించలేరని స్సష్టంచేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభినందించారు. ఎందరు కెప్టెన్లు వచ్చినా ఐసీసీ టోర్నీలన్నీ గెలిచిన ఘనతను ఎవరూ చెరపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ రికార్డు ఎప్పటికీ అతడి పేరుతోనే నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. స్టార్స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో గౌతం గంభీర్ మాట్లాడారు.
‘ఎంఎస్ ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీల రికార్డు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మరే కెప్టెన్ ఐనా ఈ ఘనతను సాధిస్తారని అనుకోను. దీనిమీద నేను పందెం కాస్తాను. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం సాధారణ విషయం కాదు. శతకాలు ఎప్పటికైనా బద్దలవుతాయి. మరెవరో వచ్చి రోహిత్ శర్మ కన్నా ఎక్కువ ద్విశతకాలు బాదేయొచ్చు. భారత్ నుంచి మరే కెప్టెన్ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిస్తాడని అనుకోను. ఎప్పటికీ మహీ పేరుతోనే ఈ ఘనత ఉంటుంది!’ అని గౌతీ అన్నారు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ సెమీస్ తర్వాత మహీ మైదానంలో అడుగుపెట్టలేదు. అతడి వీడ్కోలుపై ఎన్నో వదంతులు వచ్చాయి. వాటికి సాక్షీసింగ్ ధోనీ, కోచ్ రవిశాస్త్రి, మాజీ ప్రధాన సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడనప్పటికీ ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్లో ఆడతాడని మహీ అభిమానులు ఆశించారు. కరోనా వైరస్ ముప్పుతో ఆ టోర్నీ వాయిదా పడింది. ఐపీఎల్ సైతం మార్చిలో కాకుండా సెప్టెంబర్లో యూఏఈలో ఆరంభం అవుతోంది. రెండేళ్లుగా అతడి ప్రదర్శనలో దూకుడు లేకపోయినప్పటికీ వీడ్కోలు తర్వాత రెచ్చిపోతాడని భావిస్తున్నారు.