తెలంగాణలో కరోనా కేసుల వివరాల్లో స్పష్టత లేదని ఎంపీ రేవంత్ విమర్శ
By: chandrasekar Sat, 04 July 2020 4:04 PM
తెలంగాణలో కరోనా లెక్కలపై
ఎన్నో విమర్శలు వస్తున్నాయి. కరోనా మొదలైనప్పటి నుంచి సరైన లెక్కలు చూపించడం లేదని
విపక్షలు మండిపడుతూనే ఉన్నాయి. అటు హైకోర్టు సైతం పలుమార్లు ఆగ్రహం వ్యక్తం
చేసింది. కరోనా కేసుల వివరాల్లో స్పష్టత లేదని కాకి లెక్కలు చూపిస్తున్నారంటూ
ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో తెలంగాణలో
కరోనా కేసుల గందరగోళంపై ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తప్పుడు లెక్కలతో
ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఆధారాలను బయటపెట్టారు. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ
విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గురువారం రాత్రి వరకు రాష్ట్రంలో 18570 కరోనా
పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కారీ తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ డ్యాష్ బోర్డులో మాత్రం 21393
కేసులు చూపిస్తున్నారు.
తెలంగాణ కరోనా కేసుల
విషయంలో రెండు సెట్లు ఉన్నాయని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను ఎంపీ రేవంత్ రెడ్డి
విమర్శించారు. మీడియా బులెటిన్లో చెప్పిన లెక్కలకు, డ్యాష్ బోర్డులో ఉన్న
లెక్కలకు ఏకంగా 3వేలు తేడా ఉందని ఆయన అన్నారు. ఇందులో ఏది నిజమని? ప్రజలు
దేనిని విశ్వసించాలని ప్రశ్నించారు. కరోనా కేసుల విషయంలో వాస్తవ లెక్కలను
బయటపెట్టాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెలను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.