Advertisement

సినిమా థియటర్స్ ఓపెన్ ..ఈ నెల 15 నుంచి :

By: chandrasekar Thu, 01 Oct 2020 11:51 AM

సినిమా థియటర్స్  ఓపెన్ ..ఈ నెల 15 నుంచి :


కేంద్ర హోం శాఖ తాజాగా అన్‌లాక్‌–5 మార్గదర్శకాలను జారీ చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా బుధవారం అన్‌లాక్‌–5 మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా పాఠశాలలు, విద్యా, శిక్షణ సంస్థలు తెరిచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. 50 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు అనుమతిచ్చింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను యథాతథంగా కొనసాగించింది.

అక్టోబర్‌ 15 నుంచి అనుమతించేటివి ఇవే:

*50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవచ్చు. దీనికోసం కేంద్రసమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక నియమావళి జారీ చేస్తుంది.

*వాణిజ్య శాఖ జారీ చేసే ప్రత్యేక నియమావళి ఆధారంగా వాణిజ్య సంస్థలు (బిజినెస్‌ టు బిజినెస్‌) ఎగ్జిబిషన్లు తెరుచుకోవచ్చు.

* క్రీడాకారుల శిక్షణ కోసం ఉపయోగించే స్విమ్మింగ్‌ పూల్స్‌కు అనుమతి. దీనిపై క్రీడల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రామాణిక నియమావళి జారీ చేస్తుంది.

*ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, ఈతరహా సంస్థలు తెరుచుకోవచ్చు.

విద్యా సంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు..

* అక్టోబర్‌ 15 తర్వాత పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ సంస్థలను దశల వారీగా ప్రారంభించుకునే వెసులుబాటును కేంద్రం రాష్ట్రాలకు విడిచిపెట్టింది. అయితే ఆయా సంస్థలు కేంద్రం విధించిన షరతులను పాటించాలి.

* ఆన్‌లైన్‌ విద్య, దూరవిద్య కొనసాగాలి. హాజరు నిబంధనలు అమలు చేయరాదు.

* ద్యార్థులు పాఠశాలకు రాకుండా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావడానికి ఇష్టపడితే అందుకు వారిని అనుమతించాలి.

*తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో మాత్రమే పాఠశాలలు, శిక్షణ సంస్థలకు విద్యార్థులు హాజరుకావచ్చు.

*పాఠశాలలు, శిక్షణ సంస్థలను తెరిచేందుకు కేంద్ర విద్యా శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించి నియమావళి తయారు చేసుకోవాలి.

*రాష్ట్రాల ప్రామాణిక నియమావళిని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలి.

* సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్ట్రీమ్‌లోని పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అక్టోబర్‌ 15 నుంచి ఉన్నత విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతిస్తారు. ఈ విషయంలో కేంద్ర నిధులతో పనిచేసే ఉన్నత విద్యా సంస్థల అధిపతి ఈఅవసరాన్ని గుర్తిస్తారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్‌ వర్సిటీలు తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం అని తెలియచేసారు.

Tags :
|
|
|

Advertisement