- హోమ్›
- వార్తలు›
- తల్లికి కరోనా పాజిటివ్ ఉన్న తగిన జాగ్రత్తలతో బిడ్డకు పాలివ్వవచ్చు ..రుయా సూపరింటెండెంట్
తల్లికి కరోనా పాజిటివ్ ఉన్న తగిన జాగ్రత్తలతో బిడ్డకు పాలివ్వవచ్చు ..రుయా సూపరింటెండెంట్
By: Sankar Thu, 03 Sept 2020 10:01 PM
ప్రసవం అనంతరం తల్లి కరోనా పాజిటివ్ అయినా.. తగిన జాగ్రత్తలు తీసుకొని బిడ్డకు పాలు ఇవ్వవచ్చని రుయా దవాఖాన సూపరింటెండెంట్ భారతి అన్నారు. ఏ సమయంలో అయినా తల్లిపాలు బిడ్డకు శక్తినిస్తాయని చెప్పారు. వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ ( శ్వేత) ఆధ్వర్యంలో గురువారం కార్యాలయం నుంచి టీటీడీ మహిళా ఉద్యోగులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులు జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గర్భిణికి ఎనిమిది, తొమ్మిది నెలల్లో కరోనా వస్తే ఇబ్బంది ఏమీ ఉండదని చెప్పారు. ప్రసవం తర్వాత బిడ్డకు సైతం పరీక్షలు చేయించాలన్నారు. ప్రసవం అనంతరం తల్లి తన చేతులను సబ్బుతో, శానిటైజర్తో కడగాలని, అలాగే స్థనాలను సైతం నీటితో శుభ్రం చేసుకొని, మాస్క్ ధరించి బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు.
గర్భిణులు వేడి తీరు బాగా తాగాలని, అల్లం, బెల్లం, మిరియాలతో మరిగించిన కషాయం రోజుకు 50 మిల్లీ లీటర్లు తాగితే మంచిదని సూచించారు. నిమ్మకాయ రసం తీసుకోవద్దని చెప్పారు. అలాగే సీ విటామిన్, బీ కాంప్లెక్స్, జింక్ మాత్రలు వైద్యుల సూచన మేరకు తీసుకోవాలని సూచించారు. ఆవిరి పట్టుకోవచ్చని చెప్పారు. మహిళా ఉద్యోగులు ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనే చేతులు, కాళ్లు కడుక్కోవాలని, మాస్క్ తీసివేశాకే కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు వ్యక్తం చేసిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు