కరోనా రోగుల్లో ఎక్కువ మందికి నాడీ సంబంధ లక్షణాలు...
By: chandrasekar Fri, 09 Oct 2020 12:16 PM
కరోనా వైరస్ ని ముందుగానే
గుర్తించి చికిత్స పొందితే ప్రాణాలతో బయటపడొచ్చు. ఆలస్యం చేస్తే ఊపిరి ఆగిపోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వైరస్ పట్ల
అస్సలు నిర్లక్ష్యం వద్దు. దీనికి సంబంధించి చిన్న లక్షణం బయటపడినా వెంటనే తగిన
చికిత్స అందుకోండి. ఇతరులకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించండి.
ఎందుకంటే కరోనా అందరిలో ఒకేలా ఉండదు.
ఒక్కొక్కరిపై ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా 60 ఏళ్లు
పైబడిన వృద్ధులు, డయాబెటీస్ తదితర వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా
జాగ్రత్తలు పాటించాలి. అలాగే చిన్న పిల్లలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ
నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాధి లక్షణాలు గురించి తెలిసి ఉండాలి. దగ్గు, జ్వరం, గొంతు
నొప్పి వేధిస్తుంటే తప్పకుండా అనుమానించాలి. కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అయితే, ఈ
లక్షణాలు కంటే ముందే మరికొన్ని ముందస్తు లక్షణాలు కరోనాను సూచిస్తాయట. అవేంటో
తెలుసుకుంటే వైరస్ మిమ్నల్ని పూర్తిగా
స్వాధీనం చేసుకొనే లోపే తరిమి కొట్టవచ్చు. ఆ లక్షణాలు ఏమిటో చూసేయండి మరి.
ఇన్ని రోజులు కరోనా
వస్తే జ్వరం, దగ్గు, గొంతు
నొప్పి అని ప్రధాన కారణాలే చెప్పేవారు. అవే కాకుండా కొంతమంది కరోనా బాధితుల్లో
వేరే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయట. తలనొప్పి, వాసన, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయట. ఈ
నేపథ్యంలో కరోనా కేవలం శ్వాసకోశ వ్యవస్థ మీదే కాకుండా కొంతమంది బాధితుల్లో నాడీ
వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 4 రకాల నాడీ
సమస్యలను గుర్తించారు.
ఈ 4
లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
అన్నాల్స్ ఆఫ్ న్యూరోలజీ
అధ్యయనంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. కరోనా రోగుల్లో ఎక్కువ మందికి నాడీ సంబంధ
లక్షణాలు కనిపిస్తున్నాయని స్డడీలో తెలిపారు. తలనొప్పి, మైకం, స్ట్రోక్, అప్రమత్తంగా
ఉండలేకపోవడం వంటి నాలుగు లక్షణాలు వారిలో కనిపిస్తున్నాయట. మరికొందరు బాధితుల్లో
వాసన, రుచి
చూడలేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇది కూడా నాడీ సంబంధ సమస్యేనని స్టడీలో
వివరించారు. నార్త్వెస్ట్రన్ మెడిసిన్ తమ
పరిశోధనలో భాగంగా 19 మంది కరోనా బాధితులను పరీక్షించింది. వీరిలో కరోనాకు
సంబంధించిన ప్రధాన లక్షణాల కంటే ముందే నాడీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు
గుర్తించారు. ఈ స్టడీకి నేతృత్వం వహించిన ఫెయిన్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లోని
నార్త్వెస్ట్రన్ యూనివర్శిటీ న్యూరాలజీ ఫ్రొఫెసర్ ఐగోర్ కోరాల్నిక్ మాట్లాడుతూ..
‘‘ప్రజలు, పిజీషియన్లు
తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి. దీనిపై అప్రమత్తంగా ఉండాలి. SARS-CoV-2 ఇన్ఫెక్షన్ సోకినవారిలో నాడీ సంబంధ సమస్యలు ఏర్పడుతున్నాయి. జ్వరాలు, దగ్గు, శ్వాసకోశ
సమస్యల కంటే ముందే ఈ లక్షణాలు బయటపడుతున్నాయి’’ అని తెలిపారు.