15 రాష్ట్రాల్లో 60కి పైగా అమెజాన్ గిడ్డంగుల
By: chandrasekar Sat, 25 July 2020 2:02 PM
అమెజాన్ ఈ-కామర్స్ సేవల
సంస్థ ఇండియా వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే దేశీయంగా పలు
గిడ్డంగులను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా హైదరాబాద్తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పాట్నా, లక్నో, కోల్కతా, చెన్నై, లుధియానా, అహ్మదాబాద్
వంటి నగరాల్లో కొత్తగా గోదాంలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. 80 లక్షల
చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ గోదాంలు 100 ఫుట్బాల్
మైదానంల కంటే పెద్దగా ఉంటుందని వెల్లడించింది.
ఒకవైపు కరోనా వైరస్
విజృంభిస్తుండటం, మరోవైపు వచ్చేది పండుగ సీజన్ కావడంతో ఆన్లైన్లో
కొనుగోళ్లు ఊపందుకుంటాయన్న అంచనాతో వీటిని దసరా నాటికి అందుబాటులోకి
తీసుకురానున్నట్లు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు.
భారత్లో పెట్టుబడులు పెట్టడానికి మా దీర్ఘకాలిక నిబద్ధతకు ఇది నిదర్శనమని, కొనుగోలుదారులకు
మరింత సేవలను విస్తృత పరుచాలనే ఉద్దేశంతో ఈ విస్తరణ ప్రణాళికను ప్రకటించినట్లు ఆయన
చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికి అవసరమైన ప్రతి వస్తువును
అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
కొత్తగా ఏర్పాటు చేయనున్న
వాటితో మొత్తం 15 రాష్ట్రాల్లో
60కి
పైగా గిడ్డంగులను ఏర్పాటు చేసినట్లు అవుతుందన్నారు. దీంతో వచ్చే పండుగ సీజన్లో వేలాది మందికి
ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నట్లు ఆయన వెల్లడించారు. గోదాంలు ఏర్పాటు
చేయడంతోపాటు టెక్నాలజీ, మౌలిక సదుపాయాలను మెరుగు పరుచడానికి కూడా భారీ
పెట్టుబడులు పెట్టబోతున్నది సంస్థ. కొత్తగా ఏర్పాటు చేస్తున్న గిడ్డంగుల ద్వారా
కస్టమర్ బుకింగ్ చేసుకున్న వస్తువు వేగంగా డెలివరీ చేయడానికి వీలు పడుతున్నదన్న
ఆయన తద్వారా ఆర్డర్లు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. భారత్లో ఈ-కామర్స్
విప్లవం ప్రారంభ దశలోనే ఉన్నదని, అన్ని రకాల ఉత్పత్తులు సురక్షితమైన అందించేలా ఈ
విభాగం రోజురోజుకు పుంజుకుంటుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఇటీవల
వ్యాఖ్యానించారు.