దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వల్ల నవంబర్ తొలి వారంలో 400 మందికిపైగా మృతి
By: chandrasekar Tue, 10 Nov 2020 10:12 AM
కరోనా వైరస్ ఢిల్లీ లో
అధికంగా విజృంబిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తున్నది.
నవంబర్ తొలి వారంలో 400 మందికిపైగా కబళించింది. ఒకవైపు మూడోసారి కరోనా
విజృంభణ, మరోవైపు
పెరుగుతున్న గాలి కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజువారీ
కేసుల నమోదులో మహారాష్ట్రను ఢిల్లీ అదిగమించింది.
గత వారం రోజులుగా నిత్యం
సుమారు ఏడు వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నవంబర్ తొలి వారంలోనే 46
వేలకుపైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈ ఒక్క వారంలో 427 మంది
కరోనా రోగులు మరణించడం కలకలం రేపుతున్నది. ఢిల్లీలో కరోనా మరణాలను పరిశీలిస్తే
ఆగస్టు నెలలో 458 మరణాలు నమోదు కాగా సెప్టెంబర్లో ఈ సంఖ్య 917కు
పెరిగింది.
ఇక్కడ అక్టోబర్ 1 నుంచి
31 వరకు 1,124 మంది
వైరస్ వల్ల చనిపోయారు. ఇక నవంబర్ 1 నుంచి 7 వరకు వారం రోజుల్లో 427 మంది మృత్యువాతపడ్డారు.
ఢిల్లీలో జూన్ నెలలో అత్యధికంగా 2,247 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజాగా మరోసారి మరణాల రేటు
పెరుగుతున్నది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా మరణాల రేటు 1.59 శాతం
ఉన్నది. జాతీయ స్థాయి కన్నా ఇది కాస్త ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తున్నది.
మరోవైపు కరోనా కేసులు మూడు రెట్లు పెరిగాయి. ఆదివారం ఒక్క రోజే అత్యధికంగా 7,745
పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.38
లక్షలు దాటగా మొత్తం మరణాల సంఖ్య ఏడు వేలకు చేరింది. ప్రజల్లో చైతన్యం వల్ల
మాత్రమే కట్టడి చేయడానికి వీలవుతుంది.