ముందు జాగ్రత్తగా బచ్చన్ ఇంట మరింత సెక్యూరిటీ
By: chandrasekar Thu, 17 Sept 2020 5:48 PM
బాలీవుడ్ సినీ
ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగంపై
పార్లమెంట్ లో చర్చజరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటుడు, బీజేపీ
ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సతీమణి, సమాజ్వాదీ
పార్టీ ఎంపీ జయబచ్చన్ ఆగ్రహం వ్యక్తం
చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్ను అవమానించేలా
మాట్లాడుతున్నారంటూ ఆమె రవికిషన్, కంగనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రసంగించారు.
జయబచ్చన్ పార్లమెంట్లో చేసిన ప్రసంగంపై సోషల్ మీడియాలో పలువిధాలుగా నెటిజన్లు
ట్వీట్స్ చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ముంబై పోలీసులు ముందు జాగ్రత్తగా
బచ్చన్ ఇంటి సెక్యూరిటీని మరింత పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ముంబై జల్సాలోని
బచ్చన్స్ బంగ్లా లోపల, బయట అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.
సోమవారం బీజేపీ ఎంపీ, నటుడు
రవికిషన్ బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం ఎక్కువైందని, అగ్రనటులు కూడా వాటికి
బానిసయ్యారని, చర్యలు తీసుకోవాలంటూ పేర్కొనగా ఎంపీ జయబచ్చన్ ఆగ్రహం
వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెను ఉద్దేశిస్తూ బాలీవుడ్ నటి కంగనా
కూడా ఫైర్ అయింది. జయా జీ.. నా స్థానంలో మీ కూతురు శ్వేత ఉంటే ఇలాగే మాట్లాడతారా..
ఇండస్ట్రీలో వేధిస్తున్నారని అభిషేక్ బచ్చన్ చెబితే ఇలాగే మాట్లాడేవారా? అంటూ
కంగనా ట్వీట్ చేసింది. అయితే బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్
ఆత్మహత్య అనంతరం బాలీవుడ్తోపాటు రాజకీయ పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయాయి.
నెపోటిజం, డ్రగ్స్
వల్లనే సుశాంత్ చనిపోయాడంటూ పలువురిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం
ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు పలువురు అరెస్టయ్యారు.