సిరాజ్ ప్రతిభకు దక్కిన గుర్తింపు ..ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ కు సెలెక్ట్
By: Sankar Tue, 27 Oct 2020 05:33 AM
కరోనా వైరస్ నేపథ్య పరిస్థితుల్లో... ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జంబో బృందాన్ని ఎంపిక చేసింది. నవంబర్ 27న టి20 సిరీస్తో మొదలయ్యే ఈ పర్యటనలో భారత్ మూడు టి20 మ్యాచ్లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడనుంది. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీతో ఈ పర్యటన ముగియనుంది..
చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి నేతృత్వంలోని భారత సెలక్టర్ల బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై మొత్తం 32 మందిని ఈ పర్యటన కోసం ఎంపిక చేసింది మూడు ఫార్మాట్ (టి20, వన్డే, టెస్టు)లలో కలిపి అధికారికంగా 28 మందిని ఎంపిక చేశారు. అయితే నెట్ ప్రాక్టీస్ సెషన్స్ కోసం మరో నలుగురు పేసర్లు కమలేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, నటరాజన్ కూడా ఈ 28 మందితో కలిసి ఆస్ట్రేలియాకు వెళతారు.
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో భారత టి20, వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలిసారి టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. 26 ఏళ్ల సిరాజ్ కొన్నాళ్లుగా భారత ‘ఎ’ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 36 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన సిరాజ్ మొత్తం 147 వికెట్లు పడగొట్టాడు. అతను ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు 13 సార్లు, ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు నాలుగుసార్లు తీశాడు