బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారు ...కవిత
By: Sankar Wed, 02 Dec 2020 9:08 PM
ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఎంపీగా గెలిచి రెండేండ్లు అయినా ఇప్పటివరకు కరీంనగర్కు ఏం చేశారని ప్రశ్నించారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురావాలని ఎంపీ సంజయ్ను ప్రజలు నిలదీయాలన్నారు. సంజయ్కు ధైర్యం ఉంటే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలపై కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. ఐటీఐఆర్కు నిధులు ఎప్పుడు కేటాయిస్తున్నారో అడగాలని చెప్పారు.
కేంద్ర, రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తిని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తుందని ఆక్షేపించారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన బీఎస్టీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని అన్నారు.