మోసగాడి ఆటకట్టించిన ఎమ్మెల్యే రజిని
By: Dimple Thu, 10 Sept 2020 11:16 AM
మోసగాళ్లు ప్రజాప్రతినిధులకే ఎరవేసి.. పోలీసుల వలలో చిక్కుకున్న ఉదంతమిది. ప్రతి సంవత్సరం... ప్రజాప్రతినిధుల్ని బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. మోసపోయిన ప్రజాప్రతినిధులు బయటకు చెప్పుకోలేని ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని తన తెలివితేటలతో స్పందించి పోలీసుల దృష్టికి తీసుకురావడంతో మోసగాడి ఆటకట్టించింది.
అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి ఘరానా మోసం బారిన పడకుండా తప్పించుకోగలిగారు చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజినీ. వివరాల్లోకి వెళితే భారీ మొత్తంలో రుణాలు ఇస్తామంటూ ఓ వ్యక్తి చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీకి ఫోన్ చేశాడు. తాను సీఎం కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. సీఎం జగన్ మీతో మాట్లాడాలని చెప్పినట్లు ఎమ్మెల్యే రజనీని నమ్మబలికాడు. రుణం కావాలంటే ముందుగానే కొంత మొత్తం చెల్లించాలన్నాడు. దీంతో అనుమానం వచ్చిన ఎమ్మెల్యే.. అతని వివరాలు సేకరించారు.
విశాఖకు చెందిన జగజ్జీవన్ అనే పేరుతో సీఎం కార్యాలయంలో ఎవరైనా ఉన్నారా? అని వాకబు చేశారు. అలాంటి పేరుతో ఎవరూ లేరని నిర్ధారించుకున్న ఎమ్మెల్యే.. చాకచక్యంగా వ్యవహరించారు. అతడితో ఫోన్లో మాట్లాడుతూనే డీజీపీతో పాటు గుంటూరు అర్బన్ ఎస్పీకి విషయాన్ని చేరవేశారు. తర్వాత పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో రాయచోటికి చెందిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్ను కూడా ఇదే వ్యక్తి డబ్బులు అడిగినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.