సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కారుపై గుర్తు తెలియని దుండగుల దాడి
By: Sankar Mon, 14 Sept 2020 08:57 AM
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి వాహనంపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్లో నిలిపి ఉంచిన చాడ వెంకట్రెడ్డి కారు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారు.
అక్కడే ఉన్న కార్యాలయ భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపైనా దాడికి యత్నించారు. సమీపంలో ఉన్న పార్టీ కార్యకర్తలను వారు పిలిచేలోపే దుండగులు ద్విచక్ర వాహనంపై పారిపోయారు. పారిపోతున్న సమయంలోనూ సీపీఐ కార్యాలయం ప్రహరీ గోడ పక్కనే నిలిపి ఉంచి మరో కారునూ ధ్వంసం చేశారు. దాడి సమయంలో చాడ వెంకట్రెడ్డి గాంధీనగర్లోని తన నివాసంలో ఆన్లైన్లో లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ నిర్వహించిన రెవెన్యూ చట్టంపై సదస్సులో పాల్గొన్నారు.
దాడికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సదస్సును ముగించుకొని ఆయన కార్యాలయానికి వచ్చారు. కారు అద్ధాలు ధ్వంసం చేయడాన్ని చాడ వెంకట్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది ఆర్ఎస్ఎస్ భావాలున్న సంఘాల వారు చేసిన దాడిగా అనుమానం వ్యక్తం చేశారు.