దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం
By: Sankar Thu, 08 Oct 2020 10:30 PM
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కలిశారు. గురువారం ఆయన విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమినాయుడు, ఈవో ఎంవీ సురేష్, ఆలయ అర్చకులతో కలిసి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎం జగన్ను ఆహ్వానించారు.
కాగా, అక్టోబర్ 17 నుంచి 25 వరకు విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. 9 రోజుల్లో అమ్మవారికి 10 అలంకారాలు చేస్తారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గంటకి 1000 మంది భక్తులను మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు.
కరోనా నిబంధనలకు అనుగుణంగా 60 సంవత్సరాల లోపు వారిని, 10 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారిని దర్శనానికి అనుమతించంలేదు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు.