ఉగ్రరూపం దాల్చిన హుస్సేన్ సాగర్ ..ప్రజలు బయటకు రావొద్దని విజ్ఞప్తి
By: Sankar Wed, 14 Oct 2020 5:12 PM
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ట్యాంక్బండ్ వద్ద హుస్సేన్ సాగర్ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. వరద నీటిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్లు బుధవారం ట్యాంక్ బండ్ను సందర్శించి వరద పరిస్థితులను పరిశీలించారు. వరద నీటి దృష్ట్యా నగర వాసులంతా బయటకు రావొద్దని ఇళ్లలోని సురక్షితంగా ఉండాలంటూ ప్రజలను విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా జలమండలి ఎండీ దాన కిషోర్ హిమాయత్ సాగర్ను సందర్శించారు. వరద పరిస్థితిపై అధికారులతో సమావేశమయ్యారు. జలాశయం దిగువన ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచాలని ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్ మహాత్మగాంధీ బస్స్టాండ్లోకి వరద నీరు భారీగా రావడంతో వచ్చిపోయే బస్సులకు ఆటంకం కలిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు