Advertisement

  • మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్‌రావు హత్య

మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్‌రావు హత్య

By: chandrasekar Tue, 30 June 2020 5:26 PM

మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్‌రావు హత్య


రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కర్‌రావును కత్తితో పొడిచి హత్య చేసిన ఘటనపై ఘాటుగా స్పందించారు. ఇది పూర్తిగా రాజకీయ హత్యే అని స్పష్టం చేశారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకే కిరాయి మనుషులతో చంపించారని వ్యాఖ్యానించారు. హత్యకు 15 నుంచి 20 రోజులపాటు రెక్కీ నిర్వహించారని భావిస్తున్నామన్నారు. ఈ ఘటనపై తనతో, జిల్లా ఎస్పీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారని మంత్రి నాని చెప్పారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించవద్దని చెప్పారని వివరించారు.

తన అనుచరుడు భాస్కర్‌రావును వ్యక్తిగతంగా నేను బాబాయ్‌ అని పిలుస్తా. భాస్కర్‌రావు తండ్రి నుంచి ఆయన వరకు మాకు వెన్నంటి ఉన్నారు. చేపల మార్కెట్‌లో అభివృద్ధి పనులు చేయిస్తుంటే ఓర్వలేనితనంతో గత 15 రోజులుగా రెక్కీ నిర్వహించి పక్కా పథకం ప్రకారమే హత్య చేశారు. నేర ప్రవృత్తి ఉన్నవాళ్లే ఈ హత్యలో పాల్గొన్నారు. రాజకీయాల కోసం హత్యలు చేయడం బందరు రాజకీయాల్లో మాయని మచ్చ’ అని మంత్రి నాని తెలిపారు. మరోవైపు, భాస్కర్‌రావు హత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.

కుటుంబ సభ్యులు భాస్కర్‌రావును రాజకీయ కక్షతోనే హత్య చేశారని తెలియజేసారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో భూ ఆక్రమణలు చేశారని వాటిని వెలికి తీస్తున్న క్రమంలో భాస్కర్‌రావును హత్య చేశారని ఆయన సోదరి తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కుటుంబ సభ్యులు కోరారు.

Tags :

Advertisement