నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసిన మంత్రి కేటీఆర్
By: Sankar Fri, 25 Dec 2020 08:50 AM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 2021–22 కేంద్ర బడ్జెట్లో నిధుల విడుదలతో పాటు సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ను మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ, టెక్స్టైల్ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలో చేనేత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన నిధులతో పాటు, కోవిడ్ సంక్షోభంలో ఈ రంగాన్ని కాపాడేందుకు కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ పలు సూచనలు చేశారు.
రూ.1,552 కోట్ల అంచనాతో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కీలకమైన మౌలిక వసతుల కోసం సుమారు రూ.1,094 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వ మెగా టెక్స్టైల్ పార్క్ స్కీం కింద రూ.500 కోట్ల మేర విడుదలకు అవకాశమున్నందున బహిర్గత మౌలిక వసతుల కోసం తక్షణమే కనీసం రూ.300 కోట్లు ఇవ్వాలని కేటీఆర్ లేఖలో కోరారు.