మాటల్లో కాదు చేతల్లో సామజిక న్యాయం మాది ...మంత్రి కేటీఆర్
By: Sankar Fri, 20 Nov 2020 6:43 PM
గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ నేమినేషన్ల పర్వం ఈరోజుతో ముగిసింది. గత జీహచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన అధికారి పార్టీ టీఆర్ఎస్ తాజా ఎన్నికల్లోనూ 100 పైగా స్థానాల్లో బరిలోకి దిగింది.
ఈ సందర్భంగా మంత్రి కల్వకుంట్ల కేటీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది అందరి హైదరాబాద్.. అందరి కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ మహిళ పక్షపాతి అని, జీహెచ్ఎంసీ చట్టాన్ని మార్చి 50 శాతం రిజర్వేషన్లను మహిళకు కేటాయించామని చెప్పారు. ఈ ఎన్నికల్లో వారికి 85 స్థానాలు ఇచ్చామని వెల్లడించారు. మాటల్లో సామాజిక న్యాయం కాదు.. చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపించామని ఆయన వ్యాఖ్యానించారు..
అదే విధంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, మైనార్టీ అభ్యర్థులకు 17 స్థానాలను ఇచ్చామని తెలిపారు. అన్ని కోణాల్లో పరిశీలించి అభ్యర్థుల ఎంపిక చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన వారికి సైతం 8 స్థానాలు కేటాయించామని, అంతేగాక రాజస్థానీ వాళ్లకు కూడా సీట్లు కేటాయించామన్నారు. మేము కూడా సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినవారమే అని ఆయన అన్నారు. అయితే టికేట్ రాని వారి ఇంటికి వెళ్లి వారి సహకారాన్ని కోరాలని కేటీఆర్ ఆభ్యర్థులను కోరారు..