రాష్ట్ర హక్కుల విషయంలో ఎంత మాత్రం రాజీపడే ప్రసక్తే లేదు ..కేటీఆర్
By: Sankar Mon, 10 Aug 2020 09:43 AM
కృష్ణాజలాల విషయంలో రాష్ర్టానికి ఉన్న హక్కులపై చట్టబద్ధంగా పోరాడుతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఏపీతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, అయితే తెలంగాణ రాష్ట్ర హక్కులపై ఎలాంటి రాజీ పడబోమని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఆదివారం ట్విట్టర్లో ఆస్క్కేటీఆర్ పేరిట ప్రజలతో మంత్రి సంభాషించారు. ఈ సందర్భంగా సమకాలీన పరిస్థితులు, రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలపై సమాధానాలిచ్చారు.
కొవిడ్పై జరుగుతున్న యుద్ధంలో ప్రజలంతా ప్రభుత్వంతో కలిసి రావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కరోనా చికిత్సకు పెద్దఎత్తున ఫీజులు వసూలుచేస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్పై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో మంచి సేవలు అందిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రైవేటు దవాఖానలు చికిత్సకు నిరాకరించిన వారికి సైతం ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
ఇప్పటికే సుమారు 1200 పైగా సెంటర్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 23వేలకు పైగా కొనసాగుతున్న పరీక్షల సంఖ్య రానున్న రోజుల్లో 40వేలకు పైగా పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. కరోనా మరణాల సంఖ్య ఒక శాతం కంటే తక్కువగా ఉన్నదని, రికవరీ రేటు దేశంలోనే అత్యుత్తమంగా 72% ఉన్నదని చెప్పారు. ప్రభుత్వ దవాఖానలు చేస్తున్న సేవలను గుర్తించాలని కోరారు. ఇప్పటికే వేలమందికి చికిత్స అందించి, ఇంటికి సురక్షితంగా ఇంటికి పంపించారని చెప్పారు. ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.