ప్రతిష్టాత్మక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కేటీఆర్
By: Sankar Sat, 26 Sept 2020 08:01 AM
హైదరాబాద్ మహానగరం సిగలో మరో మణిహారం చేరింది. అత్యాధునిక టెక్నాలజీతో కండ్లు మిరుమిట్లు గొలిపేలా దుర్గంచెరువుపై రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభమయింది. రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు శుక్రవారం కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డితో కలిసి ఈ వేలాడే వంతెనను ప్రారంభించారు. దుర్గంచెరువులో బోటింగ్ను, వేలాడే వంతెనకు అనుసంధానంగా నిర్మించిన జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 ఫ్లైఓవర్ను కూడా ప్రారంభించారు.
735.639 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లతో నిర్మించిన వంతెనతో జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య దూరం తగ్గనున్నది. తెలంగాణ ప్రభు త్వం, జీహెచ్ఎంసీ కలిసి రూ.184 కోట్ల వ్యయంతో దుర్గంచెరువుపై పర్యావరణానికి హానిలేకుండా.. రెండు పిల్లర్లపై శక్తివంతమైన తీగల సహాయంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ఆసియాలోనే మొదటిదిగా నిలుస్తున్నది. మిరుమిట్లు గొలిపే ఎల్ఈడీ లైటింగ్తో వంతెన అందాలు నగరానికి ప్రత్యేక శోభను తీసుకొస్తున్నాయి. ప్రారంభోత్సవంలో భాగంగా వంతెనపై కాల్చిన పటాకులతో దీపావళి ముందుగానే వచ్చినట్టు కన్పించింది.
కార్యక్రమంలో మంత్రులు తలసాని, సబితారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, దానం, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సీఎస్ సోమేశ్కుమార్, పురపాలకశాఖ కార్యదర్శి అర్వింద్కుమార్ పాల్గొన్నారు.