భారీ వర్ష సూచనతో సహాయక చర్యలపై అప్రమత్తమైన మంత్రి కేటీఆర్
By: chandrasekar Tue, 20 Oct 2020 09:24 AM
రానున్న రోజుల్లో భారీ
వర్ష సూచనతో సహాయక చర్యలపై అప్రమత్తమైన మంత్రి కేటీఆర్. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే
అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి
శాఖ మంత్రి కేటీఆర్ అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జీహెచ్ఎంసీ
ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులతో
మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యలను కేటీఆర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని
తెలిపారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు
ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. దీనిపై పూర్తి జాగ్రత్త వహించాలని
సూచించారు.
ప్రజలు ఇబ్బందులకు లోను
కాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు శిథిలావస్థ భవనాల్లో ప్రజలను తక్షణమే
ఖాళీ చేయించాలని సూచించారు. ముంపు ప్రజల ఆశ్రయం కోసం కమ్యూనిటీ, ఫంక్షన్
హాల్స్ను సిద్ధం చేయాలని చెప్పారు. నిరాశ్రయుల కోసం అన్నపూర్ణ భోజనం అందించాలన్నారు.
ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలి. మొబైల్ టాయిలెట్లు కూడా
అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను పరిశీలించేందుకు
తక్షణమే 100 మంది సీనియర్ అధికారులను ప్రత్యేక ఆఫీసర్లుగా
నియమించాలని మున్సిపల్ శాఖను కేటీఆర్ ఆదేశించారు. 100 మంది
ప్రత్యేక ఆఫీసర్లు రాబోయే 10 రోజులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఇతర
శాఖలను సమన్వయం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అందరూ అధికారులు ప్రజలకు
ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసికోవాలని సూచించారు.