హైదరాబాద్ లో భారీ వర్షాలు...జిహెచ్ఎంసి అధికారులను అప్రమత్తం చేసిన కేటీఆర్
By: Sankar Mon, 12 Oct 2020 8:07 PM
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండిపోయాయి. ఈ వర్షాలు హైదరాబాద్ ను వదలడం లేదు. భారీ వర్షాలతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు మునిగిపోతున్నాయి.
హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాత భవనాల యజమానులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు.