కరీంనగర్లో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
By: chandrasekar Wed, 22 July 2020 10:59 AM
మంత్రి కేటీఆర్ కరీంనగర్
కార్పొరేషన్లో రోజూ శుద్ధమైన నీటి సరఫరా కోసం శాతవాహన వర్సిటీలో రూ. 110
కోట్లతో ఏర్పాటు చేసిన మెయిన్ బ్యాలెన్సింగ్
రిజర్వాయర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో
మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కరీంనగర్ పట్టణంలో ప్రతి రోజు మంచి నీరు
అందించే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్లో ఏ
కార్యక్రమం చేపట్టిన విజయవంతం అవుతుంది. ఏ పని ప్రారంభించినా కరీంనగర్లో నాంది
పలకడం సంప్రదాయంగా మారిందన్నారు.
ఇక్కడి నుంచే
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి పనుల విస్తరణ జరుగుతుందని మంత్రి
పేర్కొన్నారు. ఈ క్రమంలో 247 వాటర్ సప్లై కూడా కరీంనగర్ నుంచే ప్రారంభం
కావాలన్నారు. 30 ఏళ్ల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్సింగ్
రిజర్వాయర్ నిర్మాణం చేపట్టినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రమంత ఈ పథకం
ఆదర్శం కావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో
దీర్ఘకాలిక ప్రణాళికలతో కీలక రంగాలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఒక్కో పని
దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నామని ఆయన చెప్పారు.
బీడు భూములకు గోదావరి, కృష్ణా
జలాలను పారిస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్
అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇరిగేషన్ శాఖను జలవనరు శాఖగా మార్చామని మంత్రి
తెలిపారు. సాగు, తాగు నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా
ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రూ.
1కే
నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. కరీంనగర్ జనసాంద్రత ప్రకారం అర్బన్ లంగ్స్
ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. రాబోయే నెల రోజుల్లో కేబుల్ బ్రిడ్జి పూర్తి
చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.
కరీంనగర్కు కొత్త
అందాన్ని తెచ్చే అలుగునూరు చౌరస్తాను సుందరమైన జంక్షన్గా మార్చేందుకు చర్యలు
తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్కు పరిమితమైన ఐటీ ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు
విస్తరించింది. కరీంనగర్లో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి
తెలిపారు. టీ హబ్ ప్రాంతీయ కేంద్రం కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు కాబోతోందన్నారు.