ఖమ్మం లో ఐటి హబ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
By: Sankar Mon, 07 Dec 2020 5:17 PM
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ను కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులు పూర్తి చేయించుకున్నారు. మంత్రి పువ్వాడ వార్షిక నివేదిక ద్వారా ఖమ్మం అభివృద్ధిని వివరించారు. పువ్వాడ వంటి ప్రజాప్రతినిధి ఉండటం ఖమ్మం ప్రజల అదృష్టమని చెప్పారు.
రాష్ర్టంలో ఖమ్మానికి మించిన కార్పొరేషన్ లేదన్నారు. స్థానికంగా వీధి వ్యాపారుల ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఖమ్మం కార్పొరేషన్కు ఇతర మున్సిపాలిటీల మేయర్లను పంపించి అధ్యయనం చేయిస్తామన్నారు. ప్రజాప్రతినిధులకు పారదర్శకత అవసరం.. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఖమ్మం రహదారుల అభివృద్ధి కోసం రూ. 30 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని బుగ్గపాడులో త్వరలో ఫుడ్ పార్క్ ప్రారంభిస్తామన్నారు.