కేంద్రంపై ఫైర్ అయిన మంత్రి కేటీఆర్ ..
By: Sankar Mon, 14 Sept 2020 4:16 PM
అసెంబ్లీ వేదికగా కేంద్రం పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తాము కొత్త రోడ్లకు ఆలోచన చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం ఉన్న రోడ్లను మూసేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత అంశం గురించి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు పదిసార్లు లేఖలు రాశామని చెప్పారు. అయినా ఉలుకు పలుకు లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
జీహెచ్ఎంసీలో రోడ్ల విషయమై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మండలిలో మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. లాక్డౌన్ సమయంలో రాష్ట్రం పనిచేయాలని అనుకుంటే కేంద్రం వల్ల పనులు ఆగిపోయాయని చెప్పారు. విభజన రాజకీయాలు కాకుండా రాష్ట్రం కోసం బీజేపీ ప్రజాప్రతినిధులు ఏమైనా చేస్తే బాటుందని సూచించారు. నాలుగు ప్రణాళికలతో హైదరాబాద్ నగరంలో రోడ్లను అభివృద్ధిచేస్తున్నామన్నారు. మిస్సింగ్, లింక్ రోడ్లను గుర్తించి అభివృద్ధిచేస్తున్నామని వెల్లడించారు.
ఇక తెలంగాణ శాసనసభ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపిన అనంతరం సభను రేపు ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా సింగరేణి కార్మికుల సమస్యలు, కారుణ్య నియామకాలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, కారుణ్య నియామకాలను అర్హతలను బట్టి భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.