హైదరాబాద్ ప్రశాంతమైన నాయకత్వంలో పనిచేస్తుంది ...కేటీఆర్
By: Sankar Mon, 23 Nov 2020 10:18 PM
గత ఆరేళ్లలో హైదరాబాద్లో ఎలాంటి మతకలహాలు లేవని.. విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు (కేటీఆర్) ధ్వజమెత్తారు.
సోమవారం ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సరూర్నగర్, ఎల్బీనగర్ డివిజన్లలో నిర్వహించిన రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో మంచినీటి సమస్యను పరిష్కరించామని, టీఆర్ఎస్ పాలనలో బస్తీలు అభివృద్ధి చెందాయని ఆయన పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్ ప్రశాంతమైన నాయకత్వంలో ఉంది. యాపిల్, అమెజాన్, గూగుల్ వంటి సంస్థలు హైదరాబాద్కు వచ్చాయి. జవహర్నగర్ డంపింగ్ యార్డ్లో కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం..
దేశంలో చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నది ఢిల్లీ తర్వాత హైదరాబాదే. పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడింది. అన్నపూర్ణ క్యాంటీన్ పేదవారి ఆకలి తీర్చింది. వరద సాయంపై కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాస్తే స్పందించలేదు. హైదరాబాద్కు కిషన్రెడ్డి చేసిందేమీ లేదని’’ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.