Advertisement

  • జగన్‌తో మైత్రీ... రాష్ట్ర ప్రయోజనాలకు తేడా వస్తే సహించం - మంత్రి కెటిఆర్‌

జగన్‌తో మైత్రీ... రాష్ట్ర ప్రయోజనాలకు తేడా వస్తే సహించం - మంత్రి కెటిఆర్‌

By: Dimple Sun, 09 Aug 2020 9:12 PM

జగన్‌తో మైత్రీ... రాష్ట్ర ప్రయోజనాలకు తేడా వస్తే సహించం - మంత్రి కెటిఆర్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, కానీ, రాష్ట్ర ప్రయోజనాల జోలికి వస్తే పోరాటానికి సైతం సిద్ధమని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జలాలపై తమ హక్కులకు సంబంధించి పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినట్లు గుర్తు చేశారు. మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విటర్ ద్వారా ‘ఆస్క్ కేటీఆర్’ (#AskKTR) కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి దాదాపు 90 నిమిషాల పాటు నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ, డిగ్రీ, పీజీ పరీక్షలు, హైదరాబాద్‌లో ప్రజా రవాణా పునరుద్ధరణ వంటి వివిధ అంశాల గురించి స్పష్టత కోసం నెటిజన్లు మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు.

భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా కుల, మత, తరగతులకు అతీతంగా అందరికీ సమానమైన అవకాశాలు, గౌరవం లభించే రామ రాజ్యం రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. విద్యావంతులు ప్రజాస్వామిక ప్రక్రియలో భాగస్వాములుగా ఉండాలని ముఖ్యంగా చదువుకున్న యువత నిమ్మకుండా ఉండడం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌పై జరుగుతున్న యుద్ధంలో ప్రజలంతా ప్రభుత్వంతో కలిసి రావాలని కేవలం ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదని కేటీఆర్ అన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి సేవలు అందిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కేటీఆర్ కోరారు. కరోనా చికిత్సకు రూ.లక్షల్లో చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్లపై కేటీఆర్ ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా మరణాల సంఖ్య ఒక శాతం కంటే తక్కువగా ఉందని గుర్తు చేశారు. కరోనా రికవరీ రేటు దేశంలోనే అత్యుత్తమంగా 72 శాతంగా నమోదవుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే సుమారు 1200 పైగా కేంద్రాల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, ప్రస్తుతం రోజుకు 23 వేలకు పైగా కొనసాగుతున్న టెస్టుల సంఖ్య రానున్న రోజుల్లో 40 వేలకు పైగా పెరుగుతాయని కేటీఆర్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా ఆరోగ్య శ్రీ అత్యుత్తమమైన పథకమని కొనియాడారు. ఆ పథకం ఆరోగ్య శ్రీ నమూనాపై ఆధారపడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో సిటీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రోరైలు వంటి సేవల ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నామని మంత్రి వెల్లడించారు.

Tags :
|
|

Advertisement