రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసిరిన మంత్రి హరీష్ రావు
By: Sankar Mon, 19 Oct 2020 3:21 PM
దుబ్బాకలో బీజేపీ నాయకుల గోబెల్స్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని, ప్రజలను మభ్యపెట్టేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దుబ్బాకలో టీఆర్ఎస్ జెండా, గద్దె కూలగొట్టినట్లు, టీఆర్ఎస్ నాయకులపై ప్రజలు ఎదురు తిరిగినట్లు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు..
బీడీ కార్మికులకు కేంద్రం ఏం సాయం చేస్తుందో చర్చకు ఎక్కడైనా సిద్ధమే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఆర్థిక మంత్రి హరీష్రావు సవాల్ విసిరారు. రూ.1600 కాదు, పదహారు పైసలు కూడా కేంద్రం ఇవ్వడంలేదుని తెలిపారు. రూ.1600 ఇస్తున్నట్లు రుజువు చేస్తే సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని అన్నారు. రుజువు చేయలేకపోతే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ రాజీనామా చేయాలన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ కుటిల రాజకీయాలు చేస్తోందని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
గతంలో ఎన్నికల సమయంలో కల్వకుర్తిలో జరిగిన సంఘటనను దుబ్బాకలో జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దుబ్బాకకు ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులు దుర్వినియోగం అయినట్లు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి పోలీసులు జైలుకు తరలించారని తెలిపారు.