Advertisement

  • రిపోర్ట్ నెగటివ్ రావడంతో మంత్రి ఎర్రబెల్లి రిలాక్స్

రిపోర్ట్ నెగటివ్ రావడంతో మంత్రి ఎర్రబెల్లి రిలాక్స్

By: chandrasekar Tue, 28 July 2020 09:54 AM

రిపోర్ట్ నెగటివ్ రావడంతో మంత్రి ఎర్రబెల్లి రిలాక్స్


యాంటీజెన్ టెస్టులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు శరీరంలో వైరస్ లేదని తేలింది. ఎర్రబెల్లి సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో హోం క్వారంటైన్లోకి వెళ్లిన ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారు. రిపోర్ట్ నెగటివ్ అని రావడంతో మంత్రి రిలాక్సయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కరోనా వైరస్ సామాజిక సమస్యగా పరిణమించిందన్నారు. ఈ సమస్యకు పరిష్కారం లేకపోవడం, మందులు రాకపోవడం ఓ విచిత్రమైన విపరీతం అని మంత్రి పేర్కొన్నారు.

కరోనా కారణంగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆందోళన చెందుతున్నాయని మంత్రి తెలిపారు. ఇందుకు ఎవరూ అతీతులం కాదన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మాస్కులను ధరించాలని.. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని, కాస్త సంయమనంతో వ్యవహరించాలన్నారు.

సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాల వల్ల మన రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణలోనే ఉందని ఎర్రబెల్లి తెలిపారు. కరోనా వైరస్ బాధితుల కోసం అవసరమైన మందులు, పరికరాలు, పరీక్షల కిట్లు, వైద్య నిర్వహణకు అవసరమైన ఇతర సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా సోకిందనే అనుమానం వస్తే వెంటనే సమీప ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించుకోవాలని పాజిటివ్ అని తేలితే క్వారంటైన్‌లో ఉండాలని కరోనా కట్టడి అయ్యే వరకు ప్రజలు మరికొద్ది కాలం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి ఎర్రబెల్లి స్వగృహంలో ఆయన వెంట ఉండే పీఏలు, గన్‌మెన్లు, సహాయకులకు ఈనెల 21న కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో ఆరుగురికి పాజిటివ్‌ రిపోర్టులు వచ్చినట్లు మంత్రి చెప్పారు. కరోనా లక్షణాలు కనబడక పోవడంతో వారందర్నీ వరంగల్‌ సమీపంలో 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌‌కు పంపారు.

Tags :

Advertisement