నారా లోకేష్ కు, టీడీపీ నాయకులకు మంత్రి బాలినేని శుక్రవారం లీగల్ నోటీసులు
By: chandrasekar Sat, 22 Aug 2020 00:56 AM
రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు లీగల్ నోటీసులు పంపారు. తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ పలు మీడియా చానళ్లు, టీడీపీ నాయకులకు మంత్రి బాలినేని శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు.
తమిళనాడులో మంత్రి బాలినేనికి సంబంధించిన డబ్బు దొరికిందంటూ పలు మీడియా సంస్థల్లో ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనపై లేని పోనివి కల్పించి తప్పుడు ప్రచారం చేయించారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ నాయకులు నారా లోకేష్, బొండా ఉమామహేశ్వరరావు, కొమ్మారెడ్డి పట్టాభిలతో పాటు టీవీ 5, న్యూస్
18 చానళ్లకు ఆయన లీగల్ నోటీసులు పంపి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
తమిళనాడులో గత నెలలో పోలీసులకు ఓ కారులో 5 కోట్ల రూపాయల నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే పట్టుబడ్డ రూ. 5 కోట్లు తమవేనంటూ ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు ప్రకటించారు. దీని తర్వాత కూడా ఆ డబ్బు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిదేనంటూ పలువురు టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి బాలినేని న్యాయ పోరాటానికి రెడీ ఐయ్యారు.