డిప్యూటీ మేనేజర్ దాడిలో గాయపడ్డ ఉద్యోగిని పరామర్శించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్
By: Sankar Wed, 01 July 2020 9:01 PM
డిప్యూటీ మేనేజర్ చేతిలో దాడికి గురైన మహిళా ఉద్యోగి ఉషారాణిని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె జరిగిన దాడి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సాయం అందజేస్తుందని ఆమెకు హామీ ఇచ్చారు.
కాగా, నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్న భాస్కర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉషారాణిపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దివ్యాంగురాలన్న కనీస కనికరం లేకుండా ఉషారాణిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. బాదితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు భాస్కర్ను డిప్యూటీ మేనేజర్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు..
అయితే మాస్క్ ధరించాలని చెప్పినందుకు ఆగ్రహానికి గురైన భాస్కర్ ఆమెతో గొడవపడ్డాడు. కుర్చీలో ఉన్న ఆమె జట్టు పట్టుకొని కిందపడేసి విచక్షణా రహితంగా దాడి చేశాడు. కుర్చీ హ్యాండిల్తో కొట్టడంతో ఆమె గాయపడ్డారు. అతికష్టంపై తోటి ఉద్యోగులు అతని బారినుంచి విడిపించి ఆమెను బయటకు తీసుకెళ్లారు. బాధితురాలు దర్గామిట్ట పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వరమ్మ నిందితుడిపై దాడి, నిర్భయతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను సేకరించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.