అయోధ్య రామ మందిరం శంకుస్థాపనికి వెళ్లనున్న మోడీపై విమర్శలు గుప్పించిన ఒవైసి..
By: Sankar Tue, 28 July 2020 3:32 PM
హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధమవుతున్న వేళ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
లౌకిక సూత్రానికి కట్టుబడి విధులు నిర్వర్తిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ దేశ ప్రధానిగా బాధ్యతలు స్పీకరించారని, ఇప్పుడు ఆ ప్రమాణాన్ని ఉల్లంఘింస్తున్నారని మండిపడ్డారు. అయోధ్య రామమందిర భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మోదీ వెళ్లడంపై ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న ఓ క్రిమినల్స్ గుంపు ధ్వంసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం ట్విటర్ వేదికగా ఓవైసీ పోస్ట్ చేశారు. లౌకికతత్వమనేది రాజ్యాంగంలో ముఖ్యభాగమని దానిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలని హితవుపలికారు.
కాగా ఆగస్ట్ 5న అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 250 మంది అతిధులు సైతం శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందుకోనున్నారు.