ఎవరి దారి వారిదే ..హైదరాబాద్ లో వలస కూలీల క్యాంపులు ఎత్తివేత
By: Sankar Sat, 30 May 2020 1:05 PM
దేశం మొత్తం లాక్ డౌన్ కారణంగా పనుల కోసం సొంత ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు తిరిగి వారి సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి అనేక అవస్థలు పడుతున్నారు ..భవన నిర్మాణ రంగం, పరిశ్రమలకు సడలింపు లభించినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో పనులు దొరకని వలస కార్మికులు ఇక్కడ ఉండలేక..సొంతూళ్లకు వెళ్లలేక అష్టకష్టాలు పడుతున్నారు.
ఇప్పటికే రోడ్డు, రైలు మార్గాల్లో సుమారు పది లక్షల మంది వలస కార్మికులు మహానగరం దాటేశారు. మరో రెండు లక్షల మంది సొంతూరి బాటపట్టారు. తాజాగా శుక్రవారం నగరం నుంచి మరో మూడు శ్రామిక్ రైళ్లలో సుమారు ఐదు వేలకు పైగా వలస కార్మికులు పశ్చిమ బెంగాల్కు బయలు దేరారు. లాక్డౌన్లో వలస కార్మికులు అకలితో అలమటించకుండా క్యాంప్లు ఏర్పాటు చేసి కొందరికి బియ్యం, నగదు పంపిణీ చేసి ఉపశమనం కలిగించిన ప్రభుత్వం.. వరుస సడలింపులతో నిర్వహణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంది. ఆ తరువాత కొద్ది రోజులు స్వచ్చంద సంస్థల సహకారంతో కొనసాగిన క్యాంపులు పూర్తిగా మూత పడ్డాయి.
మహా నగరంలో ఇంకా మిగిలిపోయి పనులు లభించని వలస కూలీలా కుటుంబాలు తిండీతిప్పలు లేక సొంతూళ్లకు వెళ్లలేక నరక యాతన పడుతున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్లో వివిధ రంగాలకు మినహాయింపులతో వలస కార్మికులకు చేయూత పై దృష్టి తగ్గడంతో పాటు రిలీఫ్ క్యాంప్లు సైతం క్రమంగా మూతపడ్డాయి. వాస్తవంగా నెలన్నర ముందే లాక్డౌన్ ఎత్తివేతపై భరోసా లేక వలస కార్మికులు కాలినడకన సొంతూళ్లకు బయలు దేరడంతో కేంద్ర ప్రభుత్వం రైలు, ఆ తర్వాత రోడ్డు మార్గాల ద్వారా వేళ్లేందుకు అనుమతించింది. మరోవైపు భవన నిర్మాణ రంగం, పరిశ్రమలకు కూడా మినహాయింపు ఇవ్వడంతో వలస కార్మికులు ఉరుకులు పరుగులు తీశారు. కొందరు పోలీసు యంత్రాంగం వద్ద పేర్లు నమోదు చేసుకొని సొంతూళ్లకు రోడ్డు, రైళ్ల మార్గాల ద్వారా బయలు దేరగా.... మరి కొందరు ఇక్కడే పనులు చేసేందుకు ఆగిపోయారు. అయితే ప్రభుత్వ నిబంధనలు, పెట్డుబడులు, ముడిసరుకులు, నిపుణులు లేక పూర్తి స్థాయిలో పనులు, ఉత్పత్తి ప్రారంభానికి నోచుకోలేదు. దీంతోవలస కార్మికులకు పనులు లేకుండా పోయాయి. కనీసం తినడానికి తిండి, చేతిలో చిల్లి గవ్వ లేక పోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమై తల్లడిల్లిపోతున్నారు.