Advertisement

  • సొంత ఊరికి వెళ్లడం కోసం కారు కొన్న వలస కార్మికుడు

సొంత ఊరికి వెళ్లడం కోసం కారు కొన్న వలస కార్మికుడు

By: Sankar Sat, 06 June 2020 12:12 PM

సొంత ఊరికి వెళ్లడం కోసం కారు కొన్న వలస కార్మికుడు

లాక్‌డౌన్‌తో కూలీలు, వలస కార్మికుల బతుకులు ఆగమయ్యాయి. చేసేందుకు పనిలేక, చేతిలో డబ్బులేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇంటికి బయల్దేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో పలు విషాదకర ఘటనలతో పాటు ఆసక్తికర పరిణామాలూ చోటు చేసుకుంటున్నాయి. కుటుంబంతో కలిసి స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్న ఓ వ్యక్తి శ్రామిక్ రైల్లో సీటు దొరకలేదని ఏకంగా కారు కొనుగోలు చేశాడు. భార్య, పిల్లలతో స్వగ్రామం చేరుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది.

గోరఖ్‌పూర్‌ జిల్లా పీపీ గంజ్ తాలూకా కైతోలియా గ్రామానికి చెందిన లల్లన్‌ అనే వ్యక్తి ఘజియాబాద్‌లో పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించడంతో పనిలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. లాక్‌డౌన్ ముగుస్తుందని అతడు ఆశగా ఎదురుచూస్తుండగా.. కేంద్రం అంతకంతకూ పొడిగిస్తుండటంతో ఆందోళనకు గురయ్యాడు. కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.


ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్న లల్లన్ బస్సులు, రైళ్లలో సీట్ల కోసం ప్రయత్నించాడు. కిక్కిరిసిపోతున్న బస్సులను చూసి వాటిలో సీట్లను వెతికే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తన పిల్లలకు అది ఎంతమాత్రం సేఫ్ కాదనుకున్నాడు. దీంతో శ్రామిక్ రైళ్లలో సీట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ, మూడు రోజుల పాటు ప్రయత్నించినా.. లల్లన్‌కు, అతడి కుటుంబసభ్యులకు సీటు దొరకలేదు. దీంతో అసహనానికి గురైన అతడు ఏకంగా కారునే కొనేశాడు.

నాలుగో రోజు నేరుగా బ్యాంకుకు వెళ్లిన లల్లన్ తన ఖాతాలో ఉన్న రూ.1.9 లక్షలను విత్‌డ్రా చేసుకున్నాడు. అందులో రూ.1.5 లక్షలు పెట్టి ఓ పాత కారును కొన్నాడు. తన భార్య, పిల్లలను ఆ కారులో ఎక్కించుకొని 14 గంటల ప్రయాణం తర్వాత మే 29న తన స్వగ్రామానికి చేరుకున్నాడు. ప్రస్తుతం వారంతా కైతోలియా గ్రామంలో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.



Tags :
|
|
|

Advertisement