డిప్ప్రెషన్లో వున్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా
By: chandrasekar Fri, 07 Aug 2020 3:46 PM
ప్రస్తుతం ప్రపంచంలో
ప్రతి పౌరుడు ఏదో రకంగా మానసిక ఆందోళనకు గురవుతున్న విషయం అందరికి తెలిసిందే. పేద లేదా ధనిక అనే తేడా లేకుండా అందరినీ పట్టిపీడిస్తున్న
పెద్ద విషయం మానసిక సమస్య. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మానసిక కుంగుబాటుతో
సతమతమవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఈ మానసిక
రుగ్మతపై ప్రపంచ దేశాలు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరాన్ని డబ్ల్యూహెచ్ఓ
ఇప్పటికే నొక్కి చెప్పింది.
ప్రస్తుతం విషయానికొస్తే
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా కూడా ఈ మానసిక సమస్యతో
సతమతమవుతున్నారు. ఈ విషయాన్ని అమెరికా మాజీ ప్రధమ పౌరురాలు స్వయంగా వెల్లడించారు.
తాను ‘తేలికపాటి మానసిక కుంగుబాటు’తో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. కరోనా
సంక్షోభం, అమెరికాలో జాతి వివక్ష ఆందోళనలు, రాజకీయ కారణాలు దీనికి కారణాలుగా ఆమె విశ్లేషించారు.
కరోనా మహమ్మారి కారణంగా అమెరికన్లలో మానసిక కుంగుబాటు పెరిగింది.
ప్రతి ముగ్గురు
వ్యక్తుల్లో ఒకరు మానసిక ఆందోళన సమస్యతో
బాధపడుతున్నట్లు ఓ సెన్సస్ బ్యూరో సర్వే వెల్లడించింది. 2019 సంవత్సరంలో తొలి ఆరుమాసాల్లో ప్రజల్లో కుంగుబాటు
సమస్యతో పోలిస్తే ప్రస్తుతం ఈ సమస్య ప్రజల్లో మూడు రెట్లు అధికమయ్యింది. కరోనా
మహమ్మారి కారణంగా భౌతిక దూరం నిబంధనలతో అమెరికన్లు చాలా మంది తమ సన్నిహితులు, స్నేహితులు, కుటుంబీకులను
కలుసుకోలేకపోతున్నారు.
సాంగీక దూరం మరియు వైరస్
వ్యాప్తి కారణంగా ఒంటరితనంతో వారు కుంగుబాటుకు గురవుతున్నారని ఇది వారి మానసిక
ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసిక
ఒత్తడితో అప్పుడప్పుడు రాత్రి పూట నిద్ర నుంచి లేచి కూర్చుంటున్నట్లు ‘ది మిచెల్
ఒబామా పొడ్కాస్ట్’ కార్యక్రమంలో మిచెల్ వెల్లడించారు.
అనతి కాలంలో జరిగిన
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత తాను ఎదుర్కొన్న మానసిక ఇబ్బంది
గురించి ఆమె వివరించారు. అలాగే కొందరు మానసిక ఒత్తిడితో మాస్క్లు ధరించేందుకు
నిరాకరిస్తూ గొడవపడుతున్న ఘటనల గురించి ప్రస్తావించారు. కరోనా వైరస్పై పోరాటం
నేపథ్యంలో పలువురు సహనాన్ని కోల్పోతున్నారని అన్నారు. గతంలో ఏ తరంలో ఎవరూ
ఎదుర్కోని పరిస్థితులను ప్రస్తుతం అమెరికన్లు కరోనా కారణంగా ఎదుర్కొంటున్నారని
అన్నారు. దీనివల్ల ఎక్కువమంది అమెరికన్ ప్రజలు తీవ్ర మానసిక కుంగుబాటుకు
లోనవుతున్నట్లు తెలియజేసారు.