నగరంలో గన్తో హల్చల్ ..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
By: Sankar Thu, 11 June 2020 07:25 AM
నగర వీధుల్లో గన్తో హల్చల్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో తమ దగ్గరున్న గన్తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సూరపనేని చైతన్య రామ్, బోడె వెంకట్ అనే ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి నించి తుపాకీతో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కాలనీలో మద్యం సేవించిన నిందితులు ఎంపీ స్టిక్కరింగ్ గల స్కార్పియో వాహనంలో కూకట్పల్లికి బయల్దేరారు. మార్గమధ్యలో మస్తాన్ నగర్లో పలు ద్విచక్రవాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లారు. అడ్డగించిన వారిని తుపాకీతో బెదిరింపులకు దిగారు. పలు చోట్ల స్థానికులతో వాగ్వాదానికి దిగి గన్తో బెదిరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు ఉపయోగించిన గన్ నకిలీదని, సినిమా షూటింగ్లలో ఉపయోగించేదని పోలీసులు తేల్చారు. అనధికారిక సమాచారం ప్రకారం నిందితుల్లో ఒకరైన చైతన్య రామ్ ఓ ఎంపీ, ఎమ్మెల్యేకు సమీప బంధువని తెలుస్తోంది. అయితే ఆ ఎంపీ, ఎమ్మెల్యే వివరాలు ఇంకా బయటకి రాలేదు