తెలంగాణాలో మిడతల దాడిని ఎదుర్కొనేందుకు మూందస్తూ చర్యలు
By: chandrasekar Tue, 02 June 2020 4:32 PM
రాష్ట్రంలోకి మిడతలు
ప్రవేశిస్తే ఎదుర్కొనేందుకుగాను ఇటీవల సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి లో
ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు
చేశారు. రాష్ట్రంలో మిడతల ప్రభావం గోదావరి పరీవాహక జిల్లాల్లో ఎక్కువగా ఉండే
అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించడంతో అందుకు అనుగుణంగానే తెలంగాణ సర్కారు ఆయా
జిల్లాల వ్యవసాయ, ఉద్యానశాఖల
అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో
ప్రస్తుతం యాసంగి పంటలు పూర్తిగా చేతికి వచ్చాయి. దీంతో ఉమ్మడి జిల్లా రైతులకు
ప్రస్తుతం ఉపశమనం కలిగినట్టే. ఉద్యాన శాఖకు సంబంధించి కూరగాయలు, పండ్ల తోటలను రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలు
తీసుకోవాలో ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
మార్గదర్శకాలను ఆయా మండల, గ్రామస్థాయి
అధికారులకు చేరవేయడంతో వారు రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.
మిడతల్లో మొత్తం తొమ్మిది
రకాలు ఉంటాయని అనేక అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఆఫ్రికన్ మైగ్రేటరీ, ఓరియంటల్ మైగ్రేటరీ, ఎరుపు, బ్రౌన్
మిడతలు, ఇటాలియన్ మిడతలు, మోరాకాన్
మిడతలు, బాంబే, ఆస్టేలియన్, డెజార్టు, ట్రీలోకాస్టు
వంటి రకాలు ఉన్నాయి. అయితే ఇండియాకు వచ్చే వాటిలో డెజార్టు, మైగ్రేటరీ, బాంబే, ట్రీలోకాస్టు వంటివి ఉన్నాయి. మార్చి నెలలో ఆయా
దేశాల్లో భారీ వర్షాలు కురవడంతో ఎడారి జాతికి చెందిన మిడతలు ఇతర దేశాలకు
పయనమయ్యాయి. తొలుత కెన్యాలో అడుగుపెట్టిన ఈ మిడతలు అనేక దేశాల మీదుగా ప్రయణం చేసి
పొరుగు దేశమైన పాకిస్తాన్కు గత నెలలో చేరుకున్నాయి.
పాకిస్తాన్ నుంచి నాలుగు
రోజుల క్రితం గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్టాలకు చేరుకున్నాయి. దేశ సరిహద్దు, ఎడారి ప్రాంతం కావడంతో రాజస్తాన్ను అడ్డాగా
చేసుకున్నాయి. అక్కడ ప్రస్తుతం పంటలు లేకపోవడంతో ఆహారం కోసం మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు దండులాగా కదిలాయి. ఒక్కటి కాదు రెండు కాదు
ఏకంగా చదరపు కిలోమీటరు నుంచి మొదలుకొని వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయంటే
వాటి సంఖ్య కోట్లలోనే ఉంటుందని కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు అంచనా వేశాయి.
ఒక్క చదరపు కిలోమీటరు
గుంపులో దాదాపు 4 నుంచి
5 కోట్ల మిడతలు ఉండే అవకాశం ఉందని, గంటకు ఇవి 12 నుంచి
16 కిలోమీటర్ల వేగంతో ప్ర యాణం చేస్తాయని నిపుణులు
చెబుతున్నారు. మధ్యప్రదేశ్లోని గాలి వ్యాప్తిని అనుసరించి చట్టీనగర్ మీదుగా
తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఉన్నతాధికారులు అంచనా వేశారు. కొద్ది
రోజుల క్రితం వచ్చిన తుఫాన్ కూడా మిడతలు
భారతదేశం పైపు రావడానికి దోహదం చేసిందని అధికారులు పేర్కొంటున్నారు.
ఎడారి మిడతలు నివాసం
ఉండాలంటే వాటికి ఆహార పంటలే అనుకూలం. ఖమ్మం, భద్రాద్రి
కొత్తగూడెం జిల్లాల్లో ప్రస్తుతం ఎక్కడా వ్యవసాయ పంటలు లేవు. యాసంగి పంటలు పూర్తిగా చేతికొచ్చాయి.
ఒకవేళ జిల్లాలోకి మిడతలు ప్రవేశించినా అన్నదాతలకు పెద్దగా నష్టం వాటిల్లే ప్రమాదం
లేదు. అయితే ఉద్యాన పంటలకు హాని చేసే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి.
మిడతలను ఎదుర్కొనేందుకు
ఉమ్మడి జిల్లా వ్యవసాయ, ఉద్యాన, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో సంయుక్తంగా
నిఘా కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లాలోకి మిడతలు ప్రవేశిస్తే తక్షణమే వాటిని
ఎదుర్కొని నాశనం చేసేందుకు, ఇక్కడి
నుంచి త రిమికొట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో
అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నారు. మిడతల సంచారం ఉంటే తక్షణమే జిల్లా
అధికారులకు చెప్పాలని ఆయా శాఖలు అధికారులు మండల, గ్రామస్థాయి అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఎడారి మిడతల జీవితకాలం
దాదాపుగా 2 నుంచి
6 నెలలు ఉంటుంది. ఈ సమయంలో మిడతల నివారణకు పీపీఈ
కిట్లను ఉపయోగించి ట్రాక్టర్ మౌంట్ పవర్ ఇంజిన్ల సహాయంతో రసాయనాలను పంటలపై
పిచికారీ చేయాలి. సురక్షితమైన రసాయనాలు మాలాథియన్ 50 శాతం (3.7 ఎంఎల్), డబ్ల్యూపీ (7.4
గ్రాములు), లేదా
క్లోరోఫైరీపాస్ 20 శాతం
((2.4 ఎంఎల్), లామ్డా
సైహాలోత్రిన్ 10 శాతం
(0.5 గ్రాములు) నీటిలో కలుపుకొని పిచికారీ చేసినట్లయితే
మిడతలు పంటలపై వాలే ప్రమాదం ఉండదు. అలాగే డ్రమ్ములు, ఇతర పరికరాల ద్వారా శబ్దాలు చేస్తే ఇతర ప్రాంతాలకు
వెళ్తాయి.